Tuesday, December 27, 2011

చదువు సంస్కారాలను మేళవించుకుంటూ ముందుకు సాగుతున్న సరస్వతీ శిశుమందిరాలు



పిల్లలకు తొలి గురువు తల్లి. తల్లి దగ్గరే తొలి పాఠాలు నేర్చుకుని, సంస్కారాన్ని పొందుతాడు. పిల్లల పరిపూర్ణ వికాసానికి
పాఠశాల స్థాయి వరకు విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలనే లక్ష్యంతో శ్రీ సరస్వతీ విద్యా పీఠం తెలుగు మాధ్యమ పాఠశాలలను ప్రారంభించి నడిపిస్తోంది. విద్యార్ధుల పరిపూర్ణ వికాసం అంటే శారీరిక, మానసిక, బౌద్ధిక వికాసాల కనుగుణంగా పాఠ్య ప్రణాళికను రూపొందించింది. మన ఆంధ్ర ప్రదేశ్ లో 121 ఉన్నత పాఠశాలలను, 89 మాధ్యమిక పాఠశాలలను, 175  ప్రాథమిక పాఠశాలలను, 66 ఏకోపాధ్యాయ పాఠశాలలను నడుపుతూ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అనే సత్సంకల్పంతో కొండకోనల్లో నివసించే వనవాసీయులకు ప్రత్యేకంగా పాఠశాలలను కూడా నిర్వహిస్తోంది. కొన్ని వనవాసీ గూడాల్లో, గిరిజన తాండాల్లో, వెనుకబడిన బస్తీల్లోని పిల్లలకు భారతీయ సంస్కృతి, విద్యాభిరుచి కలగాలనే భావనతో పాఠశాలలో పనిచేస్తున్న ఆచార్యుల ఆధారంగా 109 బాలసంస్కార కేంద్రాలను నిర్వహిస్తూన్నది. ఆవాస విద్యాలయాలలో 4568 మంది వనవాసీయులకు, బీదలకు ఉచితంగా విద్యనందిస్తోంది.

మొత్తమ్మీద శ్రీ సరస్వతీ విద్యా పీఠంలో
3637 మంది ఆచార్యులు (పురుషులు 1325, మహిళలు 2313) పని చేస్తున్నారు. 65150 మంది బాల బాలికలు చదువుకుంటున్నారు. ఈ వ్యవస్థ అంతా నడవడానికి విద్యాపీఠం ప్రభుత్వం నుండి ఏ విధమైన ఆర్ధిక సహాయాన్ని పొందడంలేదు. ఒక్క పైసాకూడా రాదు. విద్యారంగాన్ని వ్యాపారరంగంగా మార్చుకుంటున్న నేటి రోజుల్లో విద్యాపీఠం సేవా దృక్పథంతో ముందుకు వెళుతోంది. 

ఈ సంస్థలో పని చేస్తున్న ఆచార్యులు కూడా మంచి విద్యార్హతలతో శిక్షణ పొందిన వారే. పైగా విలువలతో కూడిన విద్యనూ, జీవితాన్ని అందించడానికి విద్యాపీఠం రూపకల్పన చేసిన శిక్షణ కూడా పొంది అతి తక్కువ వేతనానికే సిద్ధపడి అంకిత భావంతో పని చేస్తున్నారు. ప్రారంభ దశలో సిద్ధాంతం కోసం, ఆశయం కోసం ప్రభుత్వ ఉద్యోగాలను వదిలిపెట్టి ఇందులో చేరి పని చేసిన, చేస్తున్న వారెందరో ఉన్నారు. నేటికీ మరో చెట్టునో, కొమ్మనో పట్టుకొని వ్రేలాడదామని మరో ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా ఈ పవిత్ర ఆశయ సాధనలో శిశుమందిరాలకే అంకితమై జీవితాన్ని సార్ధకం చేసుకుందామని పని చేస్తున్నవారు కోకొల్లలుగా ఉన్నారు.


మారుతున్న ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ధరలు, చాలీచాలని జీతాలతో శిశుమందిరాల ఉద్యోగులు కాలం గడుపుతున్నారు. వీరందరి సంక్షేమం చూడటం సంస్థ బాధ్యత కూడా. అందుకోసమే శ్రీ సరస్వతీ విద్యాపీఠం మహా నిధికి పిలుపునిచ్చింది. 


ఈ మహానిధి సేకరణకు శ్రీ అరవిందరావు రిటైర్డు డి.జి.పి. గౌరవాధ్యక్షులుగా, జి.పుల్లారెడ్డి విద్యాసంస్థల అధిపతి శ్రీ సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా ప్రాంత స్థాయిలో సమితి ఏర్పడినది. ఉద్యోగుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్ణయం చేసింది.
 
  • భవిష్యనిధి, పెన్షను పథకము,
  • పరివార సంక్షేమ పథకము,
  • అకాల మరణం చెందిన ఆచార్యుల కుటుంబ భవిష్యనిధి. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకము
  • ఉద్యోగుల సంతతికి ప్రోత్సహకముగా కళాశాల విద్యకై పారితోషికములు
  • ఉద్యోగులకు విద్య, వైద్య, వివాహ, గృహ నిర్మాణ ఇత్యాది అవసరములకు వడ్డీ లేకుండా అప్పు ఇచ్చే వ్యవస్థ
  • పదవీ విరమణ సమయంలో పారితోషికము (గ్రాట్యుటీ) అందించుట
మొదలగు కార్యక్రమములు చేపట్టబడ్డాయి. అందుకోసం నిధిని సేకరించాలని పిలుపునివ్వడం జరిగింది. 
----------------------------------------------------------------------
ఒకదేశం, గ్రామం బాగుపడాలంటే విద్యాలయాలు, దేవాలయాలు, ధర్మశాలలవంటి వాటిని సమాజమే నడుపుకుంటూ ఉండాలి.

ఉదారస్వభావులు, దాతృత్వబుద్ధి కలవారు, సహాయ సహకారాలందించాలనే కోరిక, తనకున్న దానిలో కొంత ఇవ్వాలనే మనస్తత్వం కలవారు అసంఖ్యాకంగా ఉన్నారు. వాళ్ళ మనస్సులు విశాలం కావాలి. జరుగుతున్న ఒక మంచి పనిని స్వయంగా చూడాలి. వారందించే సేవ యోగ్య స్థానాన్ని పొందాలి. అందుకే మహానిధి సమర్పణలో భాగస్వాములై సార్థకత పొందాలి. 
----------------------------------------------------------------------

 http://www.lokahitham.net/2011/12/blog-post_21.html

No comments:

Post a Comment