Friday, October 14, 2011

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం ఆరోగ్య భారతి లక్ష్యం


"ఆరోగ్యమే మహాభాగ్యం"  అన్నది అనాదిగా వస్తున్న సూక్తి. మన దేశంలో నేడు ఆయుర్వేదం, సిద్ధ వైద్యం, యోగ, ప్రకృతి, యునాని, హోమియోపతి, అలోపతి మొదలైన వైద్య పద్ధతుల ద్వారా రోగ చికిత్స పైన విశేషమైన కృషి జరుగుతున్నది. 

ఆరోగ్యమంటే కేవలం రోగం లేకపోవటం మాత్రమే కాదు. శారీరిక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మికంగా వ్యక్తి వికసించడమే నిజమైన ఆరోగ్యం. ఈ దిశలో దృష్టి సారించి పని చేస్తున్న సంస్థ ఆరోగ్య భారతి. 

ఆరోగ్య భారతి ఉద్దేశ్యం
మనదేశానికి వారసత్వంగా లభించిన ప్రాచీన వైద్య విజ్ఞాన సంపద నుండి ప్రేరణ పొందుతూ, మన దేశాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు పని చేస్తున్న సంస్థ 'ఆరోగ్య భారతి'. దేశంలో ప్రస్తుతం ఉన్న వివిధ చికిత్సా పద్ధతులను సమన్వయ పరుస్తూ, సమాజంలోని, చిట్టచివరి వ్యక్తి కూడా ఆరోగ్యవంతుడుగా ఉండేట్లు చూడటమే ఆరోగ్య భారతి ఉద్దేశ్యం. ఆరోగ్య విజ్ఞానం ద్వారా జాగృతి కలిగిస్తూ, ప్రజలకు రోగ నిరోధక పద్ధతుల పట్ల అవగాహన కలిగిస్తూ, వైద్య సౌకర్యాలు లభింపచేయడం అవసరం.  ఈ దృష్ట్యా ఆలోచించి పవిత్ర దినమైన కార్తీక బహుళ త్రయోదశి (యుగాబ్ది 5014 ) 'శ్రీ ధన్వంతరి జయంతి' నాడు కేరళలోని కొచ్చిలో ఆరోగ్య భారతి స్థాపించబడింది. మరియు 29 జూలై 2004 న భోపాల్ లో 'ఆరోగ్య భారతి లోక్ న్యాస్' పేరిట రిజిస్టర్ చేయబడింది.  
ఆరోగ్య భారతి కార్య స్వరూపం
ఆరోగ్యవంతమైన వ్యక్తి, ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం, తద్వారా ఆరోగ్యవంతమైన భారతం - ఈ లక్ష్యాలన్నీ చేరడానికి ఆరోగ్య భారతి అనేక మహత్తరమైన కార్యక్రమాలు చేపట్టింది. వాటిలో... 
  • పాటశాల బాలబాలికల సమగ్ర ఆరోగ్యం
  • తల్లులకు 'గృహవైద్యం', యువతకు 'ప్రథమ చికిత్స' పద్ధతుల్లో శిక్షణ,
  • అందరికీ భారతీయ ఆరోగ్యజీవన శైలి ప్రబోధన,
  • పరంపరానుగతంగా వస్తున్న దేశీయ చికిత్సా పద్ధతుల శాస్త్రీయ విశ్లేషణ మరియు ప్రోత్సాహం,
  • ప్రతి గ్రామంలో 'ఆరోగ్య మిత్ర' ఎంపిక మరియు ప్రశిక్షణ,
  • అన్ని వైద్య విధానాల సమన్వయ చికిత్స (హాలిస్టిక్ ట్రీట్ మెంట్),
  • వైద్య విద్యార్ధులకు ఆరోగ్య సేవాకార్యక్రమాలు జోడించుట. 
పిల్లల ఆరోగ్య పరిరక్షణా కార్యక్రమం
భావి భారత పౌరులైన పిల్లల సమగ్ర వికాసం కోసం ఆరోగ్యం, సంస్కారం మరియు విజ్ఞాన విషయాలు చిన్న వయసులోనే అందించబడాలి. పిల్లలు పాటశాలలో 5  నుంచి 15  సంవత్సరాల వయసు వరకు (10 సంవత్సరాలు) గడుపుతారు. ఇది ఒక వ్యక్తి యొక్క జీవితంలో అతి కీలకమైన ఘట్టం. అయితే ఈ రోజు మొదటి రెండింటిని విస్మరించి, విజ్ఞానం వైపే శ్రద్ధ కనబరుస్తున్నారు. ఫలితంగా రోగగ్రస్త, అవినీతిమయ సమాజం నిర్మాణమవుతోంది. ఆరోగ్యం, సంస్కారం - ఈ రెండింటి లోటుతో సమాజం పూర్తిగా అశాంతికి గురవుతున్నది. కావున పాటశాల బాలబాలికల సమగ్ర ఆరోగ్యము భావితరాలకే కాక ప్రస్తుత సమాజపు వికాసానికి కూడా తోడ్పడగలదు. కనుకనే పైన పేర్కొన్న అన్ని కార్యక్రమాలలో మొదటి కార్యక్రమం కీలకమైనది. 


Source : http://www.lokahitham.net/2011/10/blog-post_9549.html

No comments:

Post a Comment